
బంగారం కొంటే దేశానికి జరిగే నష్టం ఏంటి.? మోదీ ఎందుకు కొనొద్దని అంటున్నారు
ప్రపంచంలో అత్యధికంగా బంగారం వినియోగించే దేశాల్లో భారత్ ఒకటి. కానీ మన దేశంలో బంగారం ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుంది. దీంతో దేశ అవసరాలకు కావాల్సిన బంగారంలో అధిక భాగాన్ని విదేశాల నుంచే దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. విదేశాల నుంచి బంగారం కొనుగోలు చేయాలంటే రూపాయల్లో కాకుండా ప్రధానంగా అమెరికన్ డాలర్లలో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. దేశంలో బంగారం డిమాండ్ పెరిగిన కొద్దీ విదేశాలకు ఎక్కువ డాలర్లు వెళ్లిపోతాయి. దీంతో దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే అవసరం లేని బంగారం కొనుగోళ్లు తగ్గితే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసుకునే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. భారత్ విదేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకునే వస్తువుల్లో ముడి చమురు తర్వాత బంగారం కూడా కీలక స్థానంలో ఉంటుంది. బంగారం కొనుగోలు కోసం ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తే దేశ దిగుమతుల వ్యయం పెరుగుతుంది. దీని వల్ల ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరం పెరిగి వాణిజ్య లోటు అధికమయ్యే అవకాశం ఉంటుంది. విదేశీ కరెన్సీపై డిమాండ్ పెరిగినప్పుడు భారత రూపాయిపై కూడా ఒత్తిడి పడుతుంది. రూపాయి విలువ తగ్గితే మరో సమస్య ఎదురవుతుంది. ముడి చమురు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర విదేశీ ఉత్పత్తుల దిగుమతులు మరింత ఖరీదవుతాయి. చివరకు వాటి ప్రభావం దేశీయ ధరలపై పడి ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంటుంది. చాలా మంది బంగారాన్ని పెట్టుబడిగా భావించి నగలు, నాణేలు లేదా బిస్కెట్ల రూపంలో కొనుగోలు చేసి ఇంట్లో లేదా బ్యాంకు లాకర్లలో భద్రపరుస్తుంటారు. అయితే ఇలా పెద్ద మొత్తంలో డబ్బు బంగారం రూపంలో నిల్వ ఉండిపోతే అది నేరుగా ఉత్పాదక రంగాల్లోకి వెళ్లదు. ఉదాహరణకు అదే డబ్బును బ్యాంకు డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్లు, కంపెనీల షేర్లు లేదా కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే ఆ నిధులు ఆర్థిక కార్యకలాపాలకు ఉపయోగపడతాయి. బ్యాంకుల్లో డబ్బు